విజయా ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు స్వర్గీయ బి.నాగిరెడ్డి స్మారకార్థం ప్రతి సంవత్సరం ‘నాగిరెడ్డి స్మారక పురస్కారం’ ప్రదానం చేస్తారు. ఆరేళ్లుగా ఈ అవార్డును తెలుగు సినిమా రంగంలో ఉత్తమ సినిమాగా నిలిచిన సినిమాకు అందజేస్తున్నారు. అయితే ఈ సారి 2017 ఏడాదికి ‘ఫిదా’ సినిమాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆ సినిమా నిర్మాత, శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ (ఎస్వీసీ) అధినేత, నైజాం కింగ్ దిల్రాజుకు ‘నాగిరెడ్డి స్మారక పురస్కారం’ దక్కింది.
ఈ అవార్డును దుబాయ్లోని ఇండియన్ కాన్సొలేట్ ఆడిటోరియంలో భారతీయ దౌత్యవేత్త సుమతీ వాసుదేవన్, బి.నాగిరెడ్డి కుమారులు వెంకటరామిరెడ్డి, కోడలు భారతి రెడ్డి (విజయా ఆస్పత్రుల అధినేత్రి), గీతా రమేశ్, రమేశ్బాబు తదితరులు నిర్మాత దిల్ రాజుకు నాగిరెడ్డి స్మారక పురస్కారం అందించడంతో పాటు రూ.1.5 లక్షల నగదు బహుమతి అందజేశారు. తొలిసారిగా విదేశాల్లో ఈ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ అవార్డు అందుకోవడంపై దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశారు.