ఆంధ్రుల ఆరాద్యదైవంగా భావించే నందమూరి తారక రామారావు జీవిత కథను వెండితెర మీద చూపించబోతున్నారనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఈ సినిమాలో ఆయన తనయుడు ,హీరో బాలకృష్ట నటించి , నిర్మించడంతో ఈ ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఎన్టీఆర్ జీవితాన్ని రెండు పార్ట్లుగా విభజించి తీసిన సంగతి తెలిసిందే. కథానాయకుడు, మహనాయకుడు ఇలా ఎన్టీఆర్ జీవితాన్ని రెండు పార్ట్లుగా తీశాడు దర్శకుడు క్రిష్. సంక్రాంతికి విడుదలైన ‘యన్టిఆర్ కథానాయకుడు’ దారుణ పరాజయం కావడంతో.. రెండో భాగం ‘మహానాయకుడు’పై ఆ ప్రభావం పడింది. మొదటి పార్ట్ ఫ్లాప్ అవ్వడంతో రెండో పార్ట్పై ఎవ్వరికి పెద్దగా ఆసక్తి లేకుండాపోయింది. ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతున్న మహనాయకుడు సినిమా ఎటువంటి బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సమీక్షల ద్వారా సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ :
తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే చోట మొదటి భాగాన్ని ముగించగా అక్కడి నుంచే మహానాయకుడు మొదలవుతుంది. తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందిస్తూ.. రెండో భాగం ప్రారంభం కాగా.తన రాజకీయ ప్రచారం.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం,నాదెండ్ల భాస్కర్ రావు ఘటనతో ఫస్ట్ హాఫ్ను ముగించగా,ఎన్టీఆర్ ఢిల్లీ వెళ్లడం,రాష్ట్రపతిని కలవడం,మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం,ఇక చివరగా బసవ తారకం మరణించడంతో,సినిమాను ముగించేశారు.
నటీనటులు:
కథానాయకుడులో బాలయ్య నటనపై విమర్శలు వచ్చాయి. కాని రెండో పార్ట్లో మాత్రం బాలయ్య తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. కథ పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగగా,బాలయ్య వయసుకు తగ్గ పాత్రలో నటించి మెప్పించాడు. అసెంబ్లీలో ఎన్టీఆర్ను అవమానపరిచే సన్నివేశాల్లో బాలయ్య తన నటనతో మెప్పించాడు. ఇక బాలయ్య తరువాత సినిమాలో చెప్పుకోవాల్సిన పాత్ర విద్యాబాలన్దే. బసవతారకం పాత్రలో ఆమె నటించిన తీరు కథానాయకుడు సినిమాలో చూశాం. మహానాయకుడులో కూడా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ మరోసారి మెప్పించారు. ఇక చంద్రబాబు పాత్రలో రానా, నాదెండ్ల భాస్కర్రావు పాత్రలో సచిన్ కేద్కర్లు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
ఎన్టీఆర్ జీవితం గురించి అందరికి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్గా నిలిచిన ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి వచ్చే సరికి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడని అందరికి తెలిసిన విషయమే. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి రావడం.. మళ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం.. అటుపై ‘వెన్నుపోటు’ ఘటన చోటుచేసుకోవడం.. ఇక చివరి క్షణాల్లో ఎన్టీఆర్ క్షోభ పడటం.. ఎన్టీఆర్ స్వర్గస్తులు కావడం వంటివి సినిమాలో చూపించకపోవడంతో ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై సంపుర్ణంగా చూపించలేదనే భావన కలుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తరువాత చంద్రబాబునే హీరోగా చూపించారని చెప్పాలి. రెండో పార్ట్లో నాందెడ్లను విలన్గా చూపించిన దర్శకుడు , చంద్రబాబు పాత్రను మాత్రం చాలా సాఫ్ట్గా డీల్ చేశాడని చెప్పాలి.ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన మహానాయకుడు మీద సగటు ప్రేక్షకుడికి కూడా ఎలాంటి ఆసక్తి లేదంటేనే.. ఈ చిత్రాన్ని బాలయ్య ఏవిధంగా తీసి ఉంటాడో ఓ అంచనాకు వచ్చేశారని అర్థమవుతోంది.
బోటమ్ లైన్:
ఇది ఎన్టీఆర్ జీవిత కథ కాదు, చంద్రబాబును,టీడీపీని కాపాడే సినిమా.