సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘2.0’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెండితెరపై అధ్బుతాలను సృష్టించే దర్శకుడు శంకర్ ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ, తెలుగు భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది వేల థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.
రోబోకు సీక్వెల్గా ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించిన ‘2.ఓ’ అంచనాలను అందుకుందా? బాహుబలి రికార్డులను చిట్టి బద్దలుకొట్టనున్నాడా? శంకర్ మరోసారి తన విజన్తో మ్యాజిక్ చేశాడా?.. ఇవన్ని తెలియాలంటే ఓ సారి కథలోకి వెళ్దాం…
కథ…
ఉన్నట్లుండి నగరంలోని ప్రజల చేతిలో ఉన్న అన్ని సెల్ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ సీలింగ్ని చీల్చుకుంటూ మరీ ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఈ హఠాత్పరిమాణానికి ప్రపంచం ఆశ్చర్య పోతుంది. శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని పరిస్థితి.
భూమ్యాకర్షణ శక్తికి మించి ఏదో బలమైన శక్తి సెల్ ఫోన్లని లాక్కెళ్లిపోతోందని శాస్త్రవేత్తలు గ్రహిస్తారు. ఇంతలో సెల్ఫోన్లన్నీ అమర్చుకున్న ఓ పక్షి ఆకారపు రూపం నగరంలో చొరబడి విధ్వంసం సృష్టిస్తుంటుంది. దీనికి పరిస్కారం చూపడంలో శాస్త్రవేత్తలు విఫలం కావడంతో ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చిట్టి ‘ద రోబో’ని మళ్లీ రంగంలోకి దింపాలని భావిస్తారు. వశీకర్ (రజనీకాంత్) ఆ ప్రయత్నంలో విజయవంతం అవుతాడుఅయితే సెల్ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్న పక్షిరాజా (అక్షయ్ కుమార్)ను చిట్టి ఒంటరిగా ఎదురించిందా? ‘2.ఓ’ రావల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు పక్షిరాజాలా అక్షయ్ మారడానికి దారి తీసిన కారణాలు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
డైరెక్టర్ శకంర్ విషయానికి వస్తే…శంకర్ ఎప్పుడూ సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్నతంగా చూపిస్తుంటాడు.అయితే ఈ సినిమాకు కూడా సామాజిక కోణంలోంచే కథను ఎంచుకుని దానికి అధునాతన సాంకేతికతను జోడించిన తీరు అద్భుతం. 2.ఓ విషయంలో ఆయన సెల్ఫోన్లపై ఫోకస్ పెట్టాడు. సెల్ ఫోన్ల వల్ల వచ్చే శబ్దతరంగాల వల్ల ప్రకృతి ఎంత నష్టపోతోందో, భవిష్యత్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వస్తుందో… ఈ సినిమాలో కళ్లకు కట్టారు. వాటి చుట్టూ రజనీకాంత్ ఇమేజ్ని మ్యాచ్ చేసుకుంటూ ఓ కథ అల్లారు. విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి చేసిన మాయ అందరినీ అబ్బురపరుస్తుంది.
ప్రధమార్ధంలో సెల్ ఫోన్ల మాయం, పక్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే చిట్టి రంగ ప్రవేశం చేస్తాడో.. అప్పుడు ఇద్దరి మద్య ఓ రసవత్తరమైన పోరు చూసే అవకాశం దక్కుతుంది. ద్వితీయార్ధం మొత్తం చిట్టి – పక్షిరాజుల ఆధిపత్య పోరే చూపించారు. అసలు పక్షిరాజు కథేమిటి? ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు? అనే విషయాల్ని ఫ్లాష్ బ్యాక్లో చెప్పారు. ఆ ఎపిసోడ్ హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించాడు.
కథ పరంగా.. దర్శకుడు అద్భుతాలేం చూపించలేదు. తన దృష్టంతా ఈ సినిమాని విజువల్ వండర్గా తీర్చిదిద్దడంపైనే సాగింది. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. ఇంకొన్ని చోట్ల సాదాసీదాగా సాగాయి. అయితే… శంకర్ ఈసారి ఎమోషనల్ గా ఈ కథని మలచలేకపోయాడు. భావోద్వేగాలన్ని బలంగా రాబట్టుకొనే శంకర్… ఆ విషయంలో కాస్త లోటు చేశాడేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో … ఐష్ లోని లోటు స్పష్టంగా కనిపించింది
నటీనటుల విషయానికి వస్తే..
సూపర్స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ల చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సైంటిస్ట్ పాత్రలో వసీకరణ్గా, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. ఈ వయసులోనూ ఇలాంటి విన్యాసాలు చేయడం, జోరుగా స్టెప్పులేయడం రజనీకే చెల్లింది. ఏది విజువల్ ఎఫెక్ట్స్ రజనీకాంతో, ఏది నిజమైన రజనీనో తెలీక కన్ఫ్యూజ్ అవుతారు. అక్షయ్ పరిస్థితీ అంతే. అమీజాక్సన్ని మినహాయిస్తే… తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులెవరూ కనిపించరు.
సాంకేతికంగా ఉన్నతంగా ఉందీ చిత్రం. విజువల్ ఎఫెక్ట్స్ మరీ హాలీవుడ్ స్థాయిలో లేవు గానీ… మన తెలుగు ప్రేక్షకుల్ని మాత్రం అబ్బురపరుస్తాయి. త్రీడీలో చూడగలిగితే… ఆ ఎఫెక్ట్స్ మరింత బాగుంటాయి. బాక్సాఫీసుల వద్ద పాజిటీవ్ టాక్తో దూసుకుపోతోంది.