ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ చిత్రాల హవా నడుస్తోంది. ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేయడంతోపాటు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తర్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ రానుంది. ఈ జాబితాలో మరో మహానటుడి బయోపిక్ రానుంది.
ఆయన ఎవరో కాదు సినీ నటుడు టీఎల్ కాంతారావు జీవితచరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. కాంతారావు బయోపిక్కు దర్శకుడు దాదాసాహెబ్పాల్కే, నంది అవార్డుల గ్రహీత డాక్టర్ పీసీ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఇందులో భాగంగా నిన్న ఆయన కాంతారావు సొంత ఊరు అయిన కోదాడ మండలం ‘గుడిబండ’ వెళ్లి, ఆనాటి ఆయన సన్నిహితుల నుంచి కొన్ని వివరాలను సేకరించారు.
కాంతారావు తనయుడు ప్రతాప్ నుంచి కూడా కొన్ని వివరాలను సేకరించాననీ, ‘అనగనగా ఓ రాకుమారుడు’ పేరుతో కాంతారావు బయోపిక్ ను రూపొందించనున్నానని చెప్పారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణకుమారి .. రాజశ్రీ .. విఠలాచార్య పాత్రలు కూడా ఈ సినిమాలో వుంటాయనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
తమ గ్రామం నుంచి సినీ రంగంలో ఆనాటి అగ్రనటులతో సమానంగా ఓ వెలుగు వెలిగిన మా కత్తి కాంతారావు జీవిత చరిత్ర సినిమా తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఆయన తీసిన ప్రతి సినిమాను చూసేవారిమని అన్నారు. గ్రామం నుంచి ఆయన వద్దకు సాయం కోరి వెళితే కాదనకుండా ఇచ్చేవారని తెలిపారు. సినిమా నిర్మాణానికి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.
కాంతారావు బయోపిక్ని సినిమా తీసే డైరెక్టర్ పీసీ ఆదిత్య 100 రోజుల్లో 100 షార్ట్ఫిల్మ్లు తీసి 2015లో దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు. దీనికిగానూ సింగపూర్ ఓపెన్ యూనివర్శిటీ డాక్టరేట్, లిమ్కాబుక్లో పేరు కూడా సంపాదించాడు. త్వరలోనే కాంతారావు బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.