పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకముందు.. వైజాగ్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడన్న విషయం తెలిసిందే. అప్పటికి సత్యానంద్ ఏమీ యాక్టింగ్ స్కూల్ పెట్టి అనుభవమేమీ సంపాదించలేదు. ఆయన అలా శిక్షణ ఇచ్చిన తొలి వ్యక్తి పవన్ కళ్యాణే. మరి చిరంజీవి ఏ నమ్మకంతో పవన్ను ఆయనకు అప్పగించారు.. ఇంతకీ పవన్కు శిక్షణ ఇచ్చినందుకు పారితోషకంగా ఎంత పారితోషకం అప్పగించారు.. ఈ విశేషాలు తాజాగా ఒక ఇంటర్వ్యూలో సత్యానంద్ వెల్లడించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘‘నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవాడిని. నటించేవాడిని. డైరెక్షన్ కూడా చేసేవాడిని. వంశీ గారికి నా గురించి తెలిసి ‘మంచు పల్లకి’ సినిమాకు పని చేసే అవకాశం కల్పించారు. ఆ సందర్భంగానే చిరంజీవి గారు నన్ను గమనించారు. నేను నాటకాలు డైరెక్ట్ చేస్తానని కూడా తెలుసుకున్నారు. ఆ సందర్భంలో నేను చెప్పిన ఓ మాట ఆయనకు గుర్తుండిపోయింది. నా నాటకంలో అందరూ కొత్త వాళ్లే చేస్తారని.. వాళ్లను నేనే ట్రైన్ చేసుకుని నాటకం వేయిస్తానని చెప్పాను.
ఈ సంగతి గుర్తు పెట్టుకుని తొమ్మిదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ను నా చేతికి అప్పగించారు. కళ్యాణ్కు శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకున్నాక నేను సిలబస్ రాసుకున్నాను. నెల రోజులు చెన్నైకే వెళ్లి వాళ్లింటిదగ్గరే శిక్షణ ఇచ్చాను. తర్వాత కళ్యాణ్ను తీసుకుని వైజాగ్ వెళ్లాను. శిక్షణ అయ్యాక నేనేమీ డబ్బులు అడగలేదు. వాళ్లే లక్ష రూపాయల దాకా ఇచ్చారు. నన్ను బాగా చూసుకున్నారు. పవన్ ఆ తర్వాత కూడా నాకు సాయం చేశాడు. నా ఆర్థిక పరిస్థితి ఆయనకు తెలుసు. నా చెల్లెలి పెళ్లికి ఆదుకున్నారు’’ అని సత్యానంద్ తెలిపాడు.
Related