తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి పండుగ నిజంగంటే ఒక పండుగ. ఈ పండుగ కోసం ఎంతోమంది స్టార్ హీరోలు తమ సినిమాలు ఆపుకొని మరీ వస్తారు. సంక్రాంతి పండుగ సమయంలో పందెంకోడి మాదిరిగా థియేటర్లలోకి రావడానికి పోటీపడతారు. తమ సినిమాలు విడుదల చేసి ప్రేక్షకులకు మంచి కానుక ఇద్దామని సంక్రాంతికి పెద్దపెద్ద హీరోలందరూ వరుస గడుతారు. ఆ సమయంలో సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం. ఇక చిన్న సినిమాలు అయితే ఆ వారంలో రావడానికి భయపడతాయి. గత సంక్రాంతికి చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు ఇద్దరూ సినిమాలతో రావడంతో ఒక గంభీర వాతావరణం అలుముకుంది. వాటి సరసన శర్వానంద్, ఆర్.నారాయణమూర్తి వచ్చారు. దీంతో ప్రేక్షకులు, అభిమానుల మధ్య భీకర పోరు నడిచింది. ఆ వారమంతా సినిమా గురించే చర్చ.. రచ్చ. ఆ సినిమాలన్నీ మంచిగా ఆడాయి. తెలుగు సినీ పరిశ్రమకు మంచి బోణి పడింది. అయితే ఈసారి బోణి బోల్తా కొట్టింది.
2018 సంక్రాంతి పండుగకు నందమూరి బాలకృష్ణ, పవన్కల్యాణ్ భారీ అంచనాలతో సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజుల ముందే థియేటర్లకు వచ్చారు. మొదట పవన్కల్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసిగా వచ్చాడు. ఆ సినిమా మొదటి రోజు కళకళలాడినా రెండో రోజు థియేటర్లు జనాలు లేక బోసిపోయాయి. ఆ సినిమా భారీ డిజాస్టర్గా ముద్రపడిపోయి ప్రేక్షకులే కాకుండా అభిమానులు ఆసక్తి చూపలేదు. సినిమా నిరాశ పరచింది.
సంక్రాంతి హీరోగా ముద్రపడిన బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించిన జై సింహా విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ నటన ఏహ్యభావన కలిగించేలా ఉంది. సినిమా కూడా బాగాలేకపోవడంతో సంక్రాంతి పండుగకు తెలుగు సినీ పరిశ్రమ నిరాశ ఎదురైంది. బాలకృష్ణ ఓవరాక్షన్ చూడలేక ప్రేక్షకులు, అభిమానులు తలలు పట్టుకున్నారు.
ఈ సమయంలో స్పెషల్ చబ్బీస్ సినిమాను రీమేక్గా తీస్తూ తమిళ్తో పాటు తెలుగులో గ్యాంగ్గా తమిళ స్టార్ సూర్య వచ్చాడు. సూర్యపై కొంచె ఆశలు ఉన్నాయి. కానీ సూర్య కూడా నిరాశపరిచాడు. ఆ సినిమా అంత రేంజ్లో లేకపోవడంతో ప్రేక్షకులు ఆదరించలేదు. అల్లు అరవింద్ నిర్మించినా ఎవరూ చూడడానికి రాలేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో బోల్తా కొట్టింది.
ఇక ఆఖరులో నేను కూడా ఉన్న అని రాజ్తరుణ్ రంగులరాట్నం సినిమాతో వచ్చాడు. గత సంక్రాంతి శర్వానంద్ శతమానం భవతి మాదిరిగా మిగులుతుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా సంక్రాంతి పందెలో ఓడిపోయింది. దర్శకత్వం బాగాలేక రాజ్తరుణ్ నటన చూడలేక సినిమా ఆడలేకపోయింది. దీంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులకు నిరాశపరిచింది.
సంక్రాంతి పండుగకు సినిమాలు ఇంత నిరాశ కలిగించడం గమనార్హం. సినిమాలన్నీ ఈ విధంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు థియేటర్లకు రావడం మానేసి కుటుంబసభ్యులతో పండుగను ఎంజాయ్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు 2018 ఆరంభంలోనే నిరాశ కలిగింది. ఇక భవిష్యత్లో ఎలా ఉంటుందో చూడాలి.