రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా సచివాలయ సిబ్బంది,వాలంటీర్ల ఆధ్వర్యంలో జరగనుంది. పది రోజుల తర్వాత మిగిలిపోయిన వారి కోసం మరో 5 రోజులు సచివాలయాల్లో సర్వే కోసం అవకాశం కల్పించారు. ఇప్పటికే ఏడు సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా కులగణన పూర్తి చేయగా మంచి ఫలితం వచ్చింది.
సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు నేటి నుండి వార్డుల వారిగా ఇళ్లకు వెళ్లి ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను సేకరిస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనుండగా ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. కులగణన ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రత్యేకంగా యాప్ని రూపొందించారు. దాదాపు 723 కులాల జాబితాను ఈయాప్లో పొందుపర్చారు. అయా కుటుంబాలు వెల్లడించే వివరాల ఆధారంగా డేటీ నమోదు చేసిన అనంతరం కుటుంబంలో ఎవరైనా ఒకరి నుంచి ఆధార్తో కూడిన ఈ -కేవైసీ తీసుకోనున్నారు. ఇప్పటికే దేశంలో బిహార్ సక్సెస్ఫుల్గా కులగణనను చేపట్టింది.
ప్రస్తుతం ఏపీలో 4.89 కోట్ల జనాభా ఉందని అంచనా వేస్తుండగా జగన్ సర్కార్ చేపట్టిన ఈ కార్యక్రమంతో అన్ని కులాలకు ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందించడానికి వీలువుతుందని భావిస్తున్నారు. ఎవరైనా అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాయా…?వారికి ఏవిధంగా లబ్ది చేకూర్చవచ్చు అనేది ఈ కులగణనతో తేలిపోనుంది.