ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లగడపాటి రాజగోపాల్ది ప్రత్యేక శైలీ. 2004,2009లో విజయవాడ ఎంపీగా గెలిచిన లగడపాటి..ఉమ్మడి రాష్ట్ర విభజనను చివరి వరకు అడ్డుకున్నారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించి చెప్పినట్లుగానే 2014లో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తర్వాత ఆంధ్రా ఆక్టోపస్గా సర్వేల పేరుతో హడావిడి చేసినా అవి కూడా బుమారాంగ్ అవడంతో ఇకపై సర్వేలు కూడా చేయనని చెప్పేశారు.
అయితే కొంతకాలంగా లగడపాటి యాక్టివ్ పాలిటిక్స్లో వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. ఇక ఈ రూమర్స్ను లగడపాట ఎక్కడా ఖండించలేదు. దీంతో అంతా ఈసారి లగడపాటి ఎంపీగా పోటీ చేయడం ఖాయమనుకున్నారు. ఇక రీఎంట్రీగా టీడీపీ ఎంచుకున్నారని ప్రచారం కూడా సాగింది.
కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం లగడపాటికి తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖంగా లేరు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో తేల్చి చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవానికి టీడీపీ నేతలు లగడపాటిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు స్థానాలలో ఏదో ఒక చోట నుండి పోటీ చేయాలని కోరారు.
విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వార్ , అలాగే గుంటూరు నుండి టీడీపీ తరపున రెండు సార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేయడం లేదు. దీంతో గుంటూరు నుండైనా పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గుంటూరులో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. దీంతో రాజగోపాల్ వస్తే టీడీపీకి లాభం చేకూరుతుందని భావించినా ఆయన మాత్రం రాజకీయాలపై అనాసక్తిగానే ఉన్నారు. త్వరలోనే తన రీఎంట్రీపై వస్తున్న పుకార్లకు ఆయనే స్వయంగా పుల్ స్టాప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.