పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్కు ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీలో చేరనున్నారు పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషుకుమారి. ఇవాళ తాడేపల్లిలో సిఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. 2019లో పిఠాపురం నుండి జనసేన తరపు పోటీ చేశారు శేషుకుమారి. ఇక ఈసారి జనసేనాని పవన్ పోటీ చేస్తుండగా ఆ పార్టీకి ఇది షాక్ అనే చెప్పవచ్చు.
ఇక మరోవైపు పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తారా లేదా అన్న సందిగ్దం నెలకొంది. బీజేపీ నాయకత్వం తనను ఎంపీగా పోటీ చేయమంటోందని తెలిపారు. అయితే కాకినాడ నుండి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. ఒకవేళ తాను ఎంపీగా పోటీ చేస్తే పీఠాపురం నుండి ఉదయ్ బరిలో ఉంటారని చెప్పుకొచ్చారు పవన్.
అయితే పవన్ పైకి బీజేపీ పేరు చెప్పి కవర్ చేసినా పిఠాపురంలో గెలిచే పరిస్థితి లేదని ఇన్సైడ్ టాక్. టీడీపీ శ్రేణులు పవన్కు సహకరించడం కష్టంగా మారింది. ఆపార్టీ ఇంఛార్జీగా ఉన్న వర్మను చంద్రబాబు బుజ్జగించిన కార్యకర్తలు మాత్రం జనసేనకు పనిచేసేందుకు సిద్ధంగా లేరని తెలియడంతో పవన్ మనసు మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు మొగ్గు చూపడం ఖాయం. ఇక కాకినాడ ఎంపీగా వంగ గీతకు మంచి పేరుంది. ఆమె కాపు సామాజికవర్గానికి చెందిన నాయకురాలే. దీనికి తోడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం, గతంలో పీఠాపురం నుండే ఎమ్మెల్యేగా గెలిచారు గీత. ఇప్పుడు మళ్లీ ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండటంతో ఆమె గెలుపు ఖాయమని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు జనసేన నేతలు పార్టీని వీడుతుండటం ఇలా అన్ని పరిణామాల నేపథ్యంలో పవన్ పీఠాపురం నుండి తప్పుకుంటారనే వాదన బలంగా వినిపిస్తోంది.