అవినీతి కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ నెల రోజులు దాటింది. ఇక చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే ఇవాళ సుప్రీం కోర్టులో బాబు బెయిల్, క్వాష్ పిటిషన్కు సంబంధించి కీలక విచారణ జరగనుంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తుది విచారణతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై విచారణ విచారణ జరగనుంది.
జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, బాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. ఇవాళ వాదనలు ముగియనుండగా వెంటనే తీర్పు వెలువడుతుందా లేదా తీర్పును రిజర్వ్ చేస్తారా అన్నది వేచి చూడాలి.
20వ తేదీ తర్వాత సుప్రీంకోర్టుకు దసరా సెలవులు.ఈలోపు తీర్పు వెలువడితే ఓకే లేకపోతే మరిన్నిరోజులు జైల్లోనే చంద్రబాబు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దసరా జైలులోనే గడపాల్సిన పరిస్థితి. దీంతో సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా బెయిల్ రావడం ఖాయమనే ధీమాలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. మరి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచిచూడాలి.