పాకిస్థాన్లో జరిగిన హోరా హోరీ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 272 పార్లమెంట్ స్థానాలాకు గాను 119 స్థానాలను కైవసం చేసుకుని, మెజార్టీకి కాస్త దూరంలో ఆగిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 137 సీట్లు ఉండాలి.
ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల సాయంతో ఇమ్రాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహరించబోతున్నట్టు వెల్లడైంది. 22 ఏళ్ల పోరాటం అనంతరం, తనకు ఈ అవకాశం దక్కిందని, పేదల బాధలు తీర్చడమే తన ప్రధాన ఎజెండా అని తుది ఫలితాల ప్రకటన అనంతరం ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఈ ఎన్నికలు దేశదశను మార్చేవి అన్నారు. పేదల బాధలు తీర్చడమే తన అజెండా అని చెప్పారు. తమ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందన్నారు. ఈ ఎన్నికలు చారిత్రాత్మకం అన్నారు. అవినీతిలేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు.
భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని ఇమ్రాన్ చెప్పారు. తనను ఇండియన్ మీడియా బాలీవుడ్ విలన్లా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. నాతో నష్టం జరుగుతుందని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ భారత్తో ఎక్కువగా సంబంధాలు ఉన్న వ్యక్తిని తానేనని, అందుకు క్రికెట్కు థ్యాంక్స్ అన్నారు. వ్యాపారపరంగా కూడా భారత్ – పాకిస్తాన్ పరస్పరం సహకరించుకోవాలన్నారు.
కాశ్మీర్ అంశంపై కూడా స్పందించారు. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకొని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. సమస్యల పరిస్కారానికి భారత్ ఒకడుగు ముందుకేస్తే పాక్ రెండడుగులు ముందుకు వేస్తుందన్నారు.