అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు అత్యంత దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే . దీంతో విశాఖ ఏజెన్సీలో అల్లర్లు చెలరేగాయి. కిడారి, సోమల హత్యల తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ప్రాథమిక విచారణలో డుంబ్రిగూడ ఎస్సై అమర్ నాథ్ పై వేటువేసినట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.
పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ నాయకులు చనిపోయారన్న ఆగ్రహంతో అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై వారి అనుచరులు దాడి చేశారు. డుంబ్రిగూడ ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఔట్ పోస్ట్ ను తగలబెట్టారు. ఫర్నీచర్, ఫైళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు కొట్టారు.
ఆదివారం నాడు ఉదయం మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ మృతి చెందారు. అయితే పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని గెస్ట్ హౌజ్కు నిప్పు పెట్టారు.మృతదేహాలను డుబ్రీగుంట పోలీస్స్టేషన్ వద్ద పెట్టి ఆందోళన చేశారు. మరికొందరైతే స్టేషన్లపై దాడికి పాల్పడ్డారు. మరోవైపు అరకు పోలీస్ స్టేషన్ పై కూడ దాడికి పాల్పడ్డారు.