ఓట్ల లెక్కింపుపై క్లారిటీ ఇచ్చారు ఏపీ ఎన్నికల అధికారి ద్వివేది. మధ్యాహ్నం రెండు గంటల కల్లా మొదటి ఫలితం వస్తుందని తెలిపారు. రేపటి కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ద్వివేది తెలిపారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని… అసెంబ్లీ, పార్లమెంట్ లకు వేర్వేరుగా పరిశీలకులను నియమించామని వెల్లడించారు.
కౌంటింగ్ సెంటర్ల దగ్గర సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని వెల్లడించిన ద్వివేది.. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ ముందుగా లెక్కిస్తామని.. 12 గంటల వరకు ట్రెండ్స్ తెలిపోతాయన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర మీడియా సెంటర్తో పాటు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. సుమారు 25 వేల మంది పోలీసులు భద్రతలో ఉంటారని… 25 వేల మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారని అన్నారు. అదనంగా 10 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని ద్వివేది వివరించారు. ఎలాంటి హింస,గొడవలు లేకుండా కౌంటింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈవీఎంలలో సమస్యలు వస్తే పరిష్కరించేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని ద్వివేది అన్నారు