ఫిరాయింపు ఎంఎల్ఏ లకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వారిని అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ పోరాడుతోంది. అనర్హుల వ్యవహారం స్పీకర్ పరిశీలనతోపాటు హైకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వారిపై మరో కేసు హైకోర్టులో దాఖలైంది. వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఏ అన్నా వెంకట రాంబాబు ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు.
పార్టీ ఫిరాయించిన వారిలో అమరనాధరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియలు మంత్రి పదవులు తీసుకోవటానికి కూడా అనర్హలంటూ రాంబాబు తన పిటీషన్లో పేర్కొన్నారు. ఫిరాయింపుల అనర్హత కేసులను త్వరగా పరిష్కరించాలని సుప్రింకోర్టు కూడా చెప్పిన విషయాన్ని మాజీ ఎంఎల్ఏ తన పిటీషన్లో గుర్తు చేశారు.
రాజ్యంగంలోని 2(1)(ఎ) షెడ్యూల్ ప్రకారం పార్టీ మారిన ఎంఎల్ఏలు తమ పదవులకు వెంటనే రాజీనామాలు చేయాలన్నారు. హై కోర్టులోని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇప్పుడు మరో పిటిషన్ దాఖలవడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.