టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. థర్డ్ వేవ్లో చిన్నపిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉంది కాబట్టి.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు ప్రకటించింది. ప్రస్తుతం కరోనా కేసుల తగ్గుతున్నందున పరీక్షలు నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది.
జూలై మొదటి వారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు, జూలై చివరి వారంలో ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేశ్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఉన్నతాధికారులు, సీఎం జగన్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సీఎం జగన్ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.
ఇంటర్మీడియట్ పరీక్షలకు 10 లక్షల మంది పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్షల నిర్వహణ ప్రభుత్వానికి కొంత సవాలుగానే మారే అవకాశం ఉంది. ఆ తర్వాత విద్యార్థులకు కరోనా సోకితే.. కచ్చితంగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే అవకాశం ఉంది. అయితే థర్డ్ వేవ్ విషయంలో ఆరోగ్య నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం అందుకు ఆధారాలు లేవని అంటున్నారు. ఈక్రమంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read