రబీలో ఒక్క ఎకరం కూడా ఎండకుండా పంటలు కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జలవనరులు, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రూ.5లక్షలతో ఆటస్థలం అభివృద్ధి చేయాలని, వచ్చే సంక్రాంతి సంబరాలను ఈ ఆటస్థలాల్లోనే నిర్వహించాలని సూచించారు. నీరు-ప్రగతిపై ఈరోజు ఉదయం అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జలవనరులశాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, సెర్ఫ్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. కాలువలపై అధికారులు పర్యవేక్షణ చేయాలని.. ఉపరితల జలాలు, భూగర్భ జలాలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడ ఏ స్థాయిలో పంటలు ఉన్నాయో పరిశీలించి అవసరాన్ని బట్టి సకాలంలో తడులు అందించాలన్నారు.
పంటలు కాపాడే బాధ్యత మూడు శాఖల అధికారులదేనని తేల్చిచెప్పారు. ఉద్యాన తోటల పెంపకంతో మహిళా సంఘాల సభ్యుల సేవలు వినియోగించుకోవాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో సిమెంటు రోడ్డుల నిర్మాణ లక్ష్యం చేరుకోవాలని.. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్, పంచాయతీరాజ్, నరేగా, సెర్ఫ్ అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. సిమెంటు రోడ్ల నిర్మాణంలో ముందంజలో ఉన్న శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లా యంత్రాగాలను ముఖ్యమంత్రి అభినందించారు.