కౌలు డబ్బులు రాలేదని రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. భూములు ఇచ్చిన రైతులకు చెల్లించేందుకు రూ.187 కోట్ల 40 లక్షలు విడుదల చేసింది. ఏప్రిల్లో సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనల మేరకు ఈ డబ్బును విడుదల చేశారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో సీఆర్ డీఏ అధికారులు రైతులకు చెల్లించనున్నారు. జూన్లో విడుదల కావాల్సిన కౌలు డబ్బులు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈలోపు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాజధానిపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారి రైతుల్లో అలజడి రేగింది.
కొందరు రైతులు మాజీ సీఎం చంద్రబాబును కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. రాజధాని కోసం భూములను ఇచ్చిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయనతో చెప్పారు. తమ డబ్బులు ఇవ్వకుండా తమ భూముల్లో నిర్మించిన సచివాలయంలో మంత్రులు ఎలా కూర్చుంటారని విమర్శించారు. వాన్నింటికి నిధులను విడుదల చేసి ప్రభుత్వం చెక్ పెట్టింది.