నిన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని ఏపి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్నూ, ప్రభుత్వాన్ని పదే పదే దూషించారన్నకారణంతో రెండేళ్ల తర్వాత ఆయన్ను అరెస్టు చేయడం వెనుక కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ రఘురామ విమర్శల్ని చూసీచూడట్లుగా వదిలేసిన వైసీపీ సర్కార్.. ఇంత సడెన్గా ఆయన్ను అరెస్టు చేయడం వెనుక ఏ ఉద్దేశం ఉందన్న దానిపై సుధీర్గంగా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ హైకోర్టులో రఘురాజు బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
రఘురాజు తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు కోర్టులో వాదనలు వినిపించారు. రఘురాజు అరెస్టుకు సంబంధించి సహేతుక కారణాలు కూడా లేవని.. ఆయన విషయంలో ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే లోక్ సభ సభ్యుడు రఘురాజును అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. రఘురామకృష్ణంరాజు ని ఎటువంటి కారణాలు చూపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు.
మరోవైపు వాదనలు విన్న హైకోర్టు రఘురాజు కి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెయిల్ అంశంపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది. సీఐడీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని సూచించింది.