ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పేరిట బస్సు టికెట్ ధరలు పెంచింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటన చేశారు. డీజిల్ రేటు దాదాపు 60 శాతం పెరిగిందనీ.. రెండేళ్లలో ఆర్టీసీకి రూ.5,680 కోట్ల ఆదాయం తగ్గిందని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. తప్పని సరి పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ విధించామని తెలిపారు.
పల్లె వెలుగు బస్సులకు 2 రూపాయలు చొప్పున, ఎక్స్ప్రెస్ సర్వీసులకు రూ.5 చొప్పున, హైఎండ్ (ఎసీ) బస్సులకు రూ.10 చొప్పున డీజిల్ సెస్ను ఏపీఎస్ ఆర్టీసీ పెంచింది. ఇది పూర్తిగా డీజిల్పై విధించే సెస్ మాత్రమేనని.. టికెట్ రివిజన్ కాదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.
ఇక పల్లె వెలుగు బస్సులో కనిష్ఠ ఛార్జీ రూ.10గా ఉండనుంది. అలాగే పల్లె వెలుగు కనీస ఛార్జీ రూ.10లకు అదనంగా రూ.2 (సెస్), రూ.1 (సేఫ్టీ సెస్) విధించనున్నట్లు చెప్పారు. చిల్లర సమస్య తీర్చేందుకు పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 13 నుంచి రూ.15కు రౌండ్ ఆఫ్ చేసినట్లు వివరించారు. డీజిల్ సెస్ వల్ల ప్రజలపై ఏడాదికి రూ.720 కోట్ల భారం పడుతుంది. సెస్ వల్ల ఆర్టీసీ సంస్థకు రోజుకు రూ.2 కోట్లు రాబడి వస్తుందని అంచనా.