బీహార్ రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి.లాలూ,నితీష్ కూటమి మధ్య రోజురోజుకి అంతరం పెరిగిపోతోంది.త్వరలో అనుకోని మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం.బీహార్ లో నరేంద్ర మోదీ హవాకు ఎదురునిలిచి సత్తా చాటిన ‘మహాఘటబంధన్’ విచ్ఛిన్నమవుతోందని, సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ మధ్య విభేదాలు పెరిగాయని వార్తలు వస్తున్న వేళ, నితీశ్ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
లాలూ కొడుకు డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్, తనపై వచ్చిన అవినీతి ఆరోపణల రచ్చ తారాస్థాయికి చేరింది.ఈఆరోపనలనుంచి బయటపడకుంటే, ప్రభుత్వాన్ని రద్దు చేసి, తాజాగా మరోసారి ప్రజాభిప్రాయాన్ని కోరాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే ఈ విషయమై మరింత స్పష్టత వస్తుందని ‘న్యూస్ 18 డాట్ కామ్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న తేజస్వీ యాదవ్ ను తొలగించాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతూ ఉండటం, ఇప్పటికిప్పుడు తొలగిస్తే, ప్రభుత్వం అస్థిరమయ్యే అవకాశాలు ఉండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న నితీశ్ కుమార్, ప్రజాభిప్రాయాన్ని కోరాలని నిర్ణయించుకోవచ్చని జేడీ (యూ) వర్గాలు వెల్లడించాయని సదరు వార్తా సంస్థ పేర్కొంది.
బీహార్ లో విజయం సాధించిన మహా ఘటబంధన్ ను మరిన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, ఎలాగైనా నితీశ్, లాలూలను కలిపి ఉంచాలనే భావిస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సోనియా గాంధీ, ఇద్దరు నేతలతో విడివిడిగా మాట్లాడింది. నితీష్పై వస్తున్న ఒత్తిడిపై ఏవిధంగా నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తికరంగా మారింది.మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.