కర్నాటక సీఎంగా భాజాపా నేత యెడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణప్రభుత్వం కుప్పకూలడంతో భాజాపా మరోసారి అధికారం చేపట్టింది. రాజ్ భవన్ లో గవర్నర్ వాజ్ భాయ్ వాలా, యెడియూరప్పతో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం యెడియూరప్పకు పుష్పగుచ్ఛం ఇచ్చిన గవర్నర్ ఆయనకు అభినందనలు తెలిపారు. సీఎంగా యెడియూరప్ప మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. బల నిరూపన తర్వాత మంత్రి వర్గం ఏర్పాటు కానుంది.
కర్ణాటక సీఎంగా యెడియూరప్ప బాధ్యతలు ఇది నాల్గోసారి. తొలిసారిగా 2007, నవంబరులో సీఎంగా చేశారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో రెండోసారి యడ్యూరప్ప సీఎం అయ్యారు. యెడియూరప్ప పై అవినీతి ఆరోపణలు తలెత్తడంతో 2011లో తన పదవికి రాజీనామా చేశారు. 2018 మే లో యెడియూరప్ప మూడోసారి సీఎం అయ్యారు. అయితే, మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో కేవలం రెండు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 99 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, కాంగ్రెస్ అసంతృప్త నేత రోషన్ బేగ్ తదితరులు హాజరయ్యారు