వరుస కథనాలతో రెచ్చగొట్టేలా ప్రచురించడం.. ఇన్నాళ్లు వత్తాసు పలికి ఒక్కసారిగా బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై యూటర్న్ తీసుకున్న పత్రికపై భారతీయ జనతా పార్టీ నాయకులు కన్నెర చేశారు. తమ నాయకుడు, తమ పార్టీని దెబ్బతీసేలా వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం (ఏప్రిల్ 3) హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆంధ్ర్రజ్యోతి పత్రిక ప్రధాన కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. మోదీ వ్యక్తిత్వం గురించి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు రాసిన విశ్లేషణలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆంధ్రజ్యోతి ప్రచురితం చేస్తోంది. ఈ కథనాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీని విమర్శిస్తూ ఉండడంపై బీజేపీకి ఆగ్రహం తెప్పించింది.
వెంటనే ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన కార్యాలయాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకుని నిలువరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీపై కథనాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. శారు. బారికేడ్లను నెట్టుకుంటూ కార్యాలయం వైపు దూసుకొచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.