దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఫార్మా స్టాక్స్ దెబ్బకు మార్కెట్లు నష్టాల బాట పట్టినట్టు తెలిసింది. సెన్సెక్స్ 216 పాయింట్లు కోల్పోయి 34,949 వద్ద ముగియగా, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 10,633 వద్ద ముగిసింది. కొన్ని రోజులుగా వరుసగా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మాత్రం మదుపర్ల లాభాల స్వీకరణతో నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే, నేడు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు రూపాయి విలువ పతనమయిందని అన్నారు.
ఒక వైపు ఇటలీ, మరోపక్క స్పెయిన్లో తలెత్తిన రాజకీయ అనిశ్చితి కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి.దీనికి తోడు తూత్తుకుడిలో వేదంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ ఫ్యాక్టరీ స్థాపనపై పెద్ద ఎత్తున్న ఆందోళనలు చెలరేగడంతో, ఆ ఫ్యాక్టరీ మూతకు చర్యలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో వేదంత షేర్లు ఠక్కున కిందకి పడిపోయాయి. రెండు రోజుల్లో మే నెల డెరివేటివ్ సిరీస్ ముగియనుండటం, మూడు రోజులుగా మార్కెట్ల ర్యాలీ అంశాల కారణంగా కూడా పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో మార్కెట్లు పడిపోయినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు.
టాప్ గెయినర్స్: గెయిల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
లూజర్స్: ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్ బ్యాంక్.