ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో వీలైనంత తొందరగా వ్యాధికారక వైరస్ను గుర్తించడమే ఎంతో కీలకం. ఇప్పటివరకు వైరస్ నిర్ధరణ కోసం ఆర్టీ-పీసీఆర్తో పాటు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను వాడుతున్నారు. అయితే, తాజాగా స్మార్ట్ఫోన్ ఆధారంగా కేవలం అరగంట వ్యవధిలోనే కొవిడ్ నిర్ధరణ ఫలితాన్నిచ్చే నూతన సాంకేతికతను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటికి సంబంధించిన పరిశోధనా నివేదిక సెల్ జర్నల్లో ప్రచురితమైంది.
నూతన విధానంలో, క్యాస్13 ప్రోటీన్ను రిపోర్టర్ మాలిక్యూల్తో ముందుగానే కలిపి ఉంచి.. దీన్ని వ్యక్తి నుంచి (శ్వాబ్ ద్వారా) సేకరించిన కొవిడ్ శాంపిల్తో జతచేస్తారు. ఈ శాంపిల్ ఉన్న పరికరాన్ని స్మార్ట్ఫోన్కు అనుసంధానించినప్పుడు అది కరోనావైరస్కు కారణమైన సార్స్-కోవ్-2 వైరస్ను గుర్తిస్తుంది. అయితే, ఆ సమయంలో స్మార్ట్ఫోన్ కెమెరా మైక్రోస్కోప్గా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందుబాటులోకి తెచ్చేలా.. పరీక్షను వివిధ రకాల మొబైల్ ఫోన్లకు అనుగుణంగా మార్చవచ్చని పరిశోధకులు తెలిపారు.