మత్తు పదార్థాలను సరఫరా చేసె స్మగ్లర్లపై అధికారులు ఉక్కుపాదం మోపడంతో అడ్డదారులు వెతుక్కుంటున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఆంబులెన్స్లో ప్రజల ప్రాణాలు తీసే గంజాయిని సరఫరా చేస్తున్నారు స్మగ్లర్లు. విశాఖ జిల్లాలో ఆంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల 13 కేజీల గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని సరఫరా చేస్తున్న ఆంబులెన్స్ను పట్టుకోవడంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆంబులెన్స్లో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో డీఆర్ఐ అధికారులు ఆంబులెన్స్ను పట్టుకోవడానికి ట్రై చేశారు. కాని డ్రైవర్ ఆపకపోవడంతో నేషనల్ హైవే మీద కొద్దిసేపు ఛేజింగ్ జరిగింది. సబ్బవరం వద్ద ఆంబులెన్స్ను ఆపి తనిఖీలు చేయగా, అందులో కట్టలు కట్టలుగా గంజాయి బయటపడింది. దాని విలువ దాదాపు 2 కోట్ల 71 లక్షల 95 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అంబులెన్స్ను సీజ్ చేసిన అధికారులు.. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.