కర్నూలు జిల్లాలో మరో సారి న్నికల సమరం జరగనుంది. రెండు ప్రధాన పార్టీలమధ్య ఉత్కంఠపోరుకు తెరలేవనున్నది. మొన్న జరిగిన నంద్యాల ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఎంతటి టెన్షన్ పెంచేసిందో అందరూ చూసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య ఎలాంటి పోరు జరిగిందో అందరికి తెలిసిందే. అటువంటిది మళ్ళీ అదే జిల్లాలో మరో ఎన్నికంటే మాటలు కాదు.
అసలు విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీ ఎన్నికకు ఎన్నికల కమీషన్ భేరి మోగించింది. ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసింది ఈసీ. నంద్యాల బైపోల్ సమయంలో టిడిపి ఎంఎల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం టిడిపి ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉప ఎన్నికలో ఫలితం చూస్తే టీడీపీ విజయం సాధించింది. అది అయిపోయిన విషయం. ఇప్పుడు మరో సారి పందెంకోల్లు తలపడనున్నాయి.
ఉప ఎన్నికలో టీడీపీ ఎలా వ్యవహరించిందో తెలిసిందే. ఎలా వ్యవహరించినా అంతిమంగా గెలుపే ముఖ్యం. రేపటి ఎంఎల్సీ ఎన్నికలో ఏమవుతుందో ఇపుడే చెప్పలేం. ఎందుకంటే, వైసిపి తరపున చక్రపాణిరెడ్డి ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి, టిడిపి తరపున ఎవరుంటారో చూడాలి.
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ తరుపున భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గంతోపాటు జిల్లా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఎన్నికల సమయంలో పనులు ప్రారంభించిన టీడీపీ తర్వాత వాటిని పక్కనపెట్టింది. దీంతో మంత్రి భూమా అఖిలప్రియ మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. దానికితోడు ఇటీవలే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జిల్లాలో బాగా సక్సెస్ అయ్యింది. అంతిమంగా ఫలితం ఎలా ఉన్నా పోరు ఎలా ఉంటుందో చూడాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఎన్నిక శాంపిల్లాంటిదే అనుకోవాలి.
ఈనెల 19వ తేదీన షెడ్యూల్ విడుదల అవుతుంది. జనవరి 12న పోలింగ్, జనవరి 16వ తేదీన కౌటింగ్ జరుగుతుంది.