- Advertisement -
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రం దిగొచ్చేంతవరకు ఢిల్లీలోనే ఉంటామని.. నిరసనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హరిందర్ సింగ్. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని సింఘూ వద్ద రైతులతో జరిగిన సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని రైతులు వెల్లడించారు. ఇంతకు ముందు కూడా చర్చలు జరిగాయని.. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు. కొత్త చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశరాజధానికి రైతుల తాకిడి గంటగంటకూ పెరుగుతోంది. తాజాగా.. ‘ఢిల్లీ ఛలో’లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, బస్సుల్లో ఢిల్లీకి బయలుదేరారు. శంభూ వద్ద పంజాబ్-హరియాణా సరిహద్దును దాటారు.