ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన క్రూరమృగాలు ప్రజలపై దాడి చేస్తున్న సంఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. నీరు, ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో చిరుత కలకలం రేపుతోంది. గ్రామంలో నలుగురిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అధికారులు ఆసుపత్రికి తరలించి చికత్త అందిస్తున్నారు.
చిరుతను సమీప అడవుల్లోకి తరమాలని ప్రజాలు ఎంత ప్రయత్నించినా కుదరడంలేదు. చిరుత కొబ్బరిచెట్టు ఎక్కి కూర్చుని దిగనంటోంది. స్థానికుల సమాచారంతో గ్రామానికి బయల్దేరారు పోలీసులు, అటవీశాఖ అధికారులు. చిరుతను పట్టుకోవడంకోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఓవైపు చీకటిపడుతుండడంతో చిరుత దొరకపోతే.. రాత్రి సమయంలో ఊరిపై విరుచుకుపడుతోందని భయాందోళనలో ఉన్నారు గ్రామస్తులు. రెండు గంటలుగా కొబ్బరి చెట్టుపైనే చిరుత కూర్చోవడంతో అది ఎటువెళ్తుందోనన్న భయంతో గ్రామస్తులు అక్కడే కాపుకాస్తున్నారు. అటవీ ప్రాంతం నుండి అంకంపాలెం గ్రామ సమీపంలోని లంక గ్రామాల్లోకి వచ్చినట్టుగా అటవీశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు