ఎర్రటి ఎండలతో ఉక్కిరి బిక్కిరైనహైదరాబాద్ వాసులను వరుణుడు కరుణించాడు. గురువారం రాత్రి హైదరాబాద్, సికింద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. హయత్ నగర్, దిల్ సుక్ నగర్, మలక్ పేట, ఇమ్లీబన్, జూబ్లీ బస్ స్టేషన్, ఎఎస్ రావు నగర్, అమీర్ పేట, బంజారాహిల్స్, ఇసిఐఎల్ తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
కొన్ని చోట్ల భారీ చెట్లు కూడా కూలిపోయాయి. గురువారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ వర్షం దాదాపు ఐదు గంటల పాటు ఏకధాటిగా కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలో జన జీవనం అతలాకుతలం అయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఇక్కడి బస్తీల్లో నివసిస్తున్న వారు రాత్రంతా నీళ్ల మధ్యనే గడపాల్సి వచ్చింది.
మరో వైపు నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్ధానికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి జిహెచ్ఎంసి ఉద్యోగులు, పోలీసులు చెట్లను తొలగించడం, రవాణా వ్యవస్ధను సరిచేయడం వంటివి చేపట్టారు.