దేశంలో కొత్త కొత్త వైరస్ లతో మనుషులు మాత్రమే కాదు.. పశు పక్షాదులు కూడా అల్లాడిపోతున్నాయి. ఇటీవల బర్డ్ ఫ్లూ వ్యాధితో ఎన్నో పక్షులు చనిపోయాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలో రాణికెట్ వ్యాధితో నాలుగువేల నాటుకోళ్లు మృతి చెందాయి. జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం కోళ్ల ఫారంకు వెళ్లి చూస్తే పెద్దమొత్తంలో మృతి చెంది కనిపించాయని, రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు స్వామి వివరించారు.
బర్డ్ ఫ్లూ సోకిన కారణంగానే కోళ్లు చనిపోయినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం పూట దాణా తిన్న తర్వాత రెండు గంటల్లోనే నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి. ఇదిలా ఉంటే.. రాణికెట్ వ్యాధి సోకడం వల్లనే కోళ్లు మృతి చెందాయని పశు వైద్యుడు సురేశ్ తెలిపారు. వ్యాధి సోకిన కోళ్లు కునికి పాట్లు తీస్తాయని, వాటి రెక్కలు నేల వాలతాయని వివరించారు.
కోళ్లకు వ్యాక్సిన్ వేయాలని సూచించానని తెలిపారు. మృతి చెందిన కోళ్లను గుంత తవ్వి అందులో పాతి పెట్టారు. అసలే ఎండాకాలం.. కోళ్లు అధిక వేడికి అల్లలాడిపోతుంటాయి.. దానికి తోడు కొత్త వైరస్ లు ఎటాక్ కావడంతో వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు.