ఈ మధ్య తరచూ వార్తల్లో వినిపిస్తున్న పేర్లలో ఒకటి కేంద్ర సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ ప్రహ్లాజ్ నిహ్లానీ. ఉడ్తా పంజాబ్ అనే బాలీవుడ్ చిత్రం విషయమై ఆయనపై ఆరోపణలు మొదలయ్యాయి. ఆ చిత్రానికి ఏకంగా 40 సెన్సార్ కట్స్ చెప్పారు. దీంతో ఆయనపై విమర్శలు చేశారు ఆ చిత్ర నిర్మాత. ఆ ఒక్కటే కాదు… ఈ మధ్య కొన్ని చిత్రాల సెన్సార్ విషయంలో కూడా ఆయన చాలా ఛాదస్తంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ఆయన ఆర్.ఎస్.ఎస్. భావజాలాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారనీ, ప్రధాని మోడీకి చెంచాగా మారిపోయారనీ, భాజపా అంటే భక్తి పెరిగిపోయిందనీ కొంతమంది ఆరోపిస్తున్నారు. సెన్సార్ బోర్డు ఛైర్మన్ పేరుతో ఆయన సినిమాలను తొక్కేస్తున్నారనీ మరో విమర్శ ఉంది. అయితే, ఈ ఆరోపణలపై చాలా ఘాటుగా స్పందించారు ప్రహ్లాజ్.
అవును… నేను మోడీకి భక్తుడనే ,ఆయనకి చెంచానే అయితే ఏంటి.. అని ఘాటుగా మాట్లాడారు. మోడీ ప్రధానమంత్రి కాక ముందే ఆయన రాష్ట్ర స్థాయిలో చేస్తున్న అభివృద్ధి గురించి తెలుసుకుని ముచ్చటపడ్డారు. ఆయన ప్రధాని కావాలని కోరుకున్నాను. ఆయన విజన్ మీద నాకు నమ్మకం ఉందన్నారు. ఆయన దేశానికి చేస్తున్న సేవలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకే, ఆయన్ని ఆరాధిస్తాను. ఆయన్ని ఇష్టపతాను. ఎవరో అంటున్నట్టుగా.. ఆయనకి చెంచా అనిపించుకోవడం కూడా నాకు గర్వ కారణమే. అది కూడా తప్పేనా… పోనీ, ఒక ఇటాలియన్ ప్రధానికి చెంచా అనిపించుకుంటే నచ్చతుందా… అంటూ తనపై విమర్శలు చేస్తున్నవారిపై మండిపడ్డారు.
ఉడ్తా పంజాబ్ చిత్రానికి 40 కట్స్ ఇచ్చిన అంశంపై కూడా ఆయన స్పందించారు. ఆ చిత్ర నిర్మాత ఎవరో తనకు వ్యక్తిగతంగా తెలియదన్నారు. తన డ్యూటీ తాను చేశాననీ… తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని, వారి ఉద్దేశాలను అనుగుణంగా ఏ పనీ చేయడం లేదనీ, తాను ఇలా వ్యవహరించడం తప్పు అని సర్కారువారు చెబితే తన విధుల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆవేశంగా చెప్పారు ప్రహ్లాజ్.