కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం నెరిపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను అడిగారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్రంప్తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడుతుండగా.. 70 ఏళ్లుగా సాగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి ట్రంప్ మధ్యవర్తిత్వం కోరుతున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.
అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని… ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ చేసిన ఆరోపణలు అబద్ధమని, వాటిని ఖండిస్తున్నామని వ్యాఖ్యానించింది. కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలని మోదీ ఎప్పుడు కూడా ట్రంప్ను కోరలేదని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్కు సంబంధించిన అంశాలన్నింటినీ ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కరించుకుంటామని, ఇందుకోసం సరిహద్దు ఉగ్రవాద, సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ఉన్నాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విట్టర్లో స్పష్టం చేశారు. భారత్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవడంతో… అమెరికా ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది.
కశ్మీర్ అంశం ఇండియా, పాకిస్థాన్ లకు చెందినదని… ఆ రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. టెర్రరిజంపై పాకిస్థాన్ కఠినమైన చర్యలు తీసుకుంటేనే… భారత్ తో చర్చలు సాధ్యపడతాయని వెల్లడించింది.