జనసేన పార్టీని పవన్ స్థాపించి నాలుగు సంవత్సరాల తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సర్వం సిద్దమయ్యాయి. సినిమాలకు స్వస్తి చెప్పిన పవన్ ఇక పూర్తి సమయం అంతా రాజకీయాలకు ఉపయోగిస్తానని ప్రకటించారు.
గుంటూరు జిల్లా నాగార్జునా యూనివర్శిటీ ఎదుట ప్రాంగణంలో నేడు (మార్చి 14) జరగనున్నజనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభలో పాల్గొనడానికి జనసేన కార్యకర్తలు, అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలను నుంచి తరలివస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సభాస్థలికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని జనసేన వర్గాలు పేర్కొన్నాయి.
జనసేన పార్టీ స్థాపన అనంతరం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇదే కావడం విశేషం. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లో హోదా నేపధ్యంలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్న తరుణం కావడంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ వేదికపై నుంచే పవన్కల్యాణ్ తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ విధి, విధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై అధినేత కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ప్రశ్నిస్తా అంటూ రాజకీయల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ హోదా విషయంలో ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నారంటూ మీడియా ప్రశ్నలన్నింటికీ ఆవిర్భావ సభలోనే సమాధాలు చెప్పుతానని పవన్ ప్రకటించడంతో పవన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది అన్ని వర్గాల్లో ఆసక్తిగా మారింది.