కొలువులు పోయి రోడ్డున పడ్డ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఆర్థిక సాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం నిధులు మంజూరు చేసింది. రూ.32 కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది(2020) మార్చి వరకు పనిచేస్తూ ఉన్నవారిని ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది.
కరోనా కారణంగా గతేడాది మార్చిలో లాక్డౌన్ విధించడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహించడంతో కేవలం 25-50 శాతంలోపు సిబ్బందినే విధుల్లోకి తీసుకున్నాయి. తొలగించిన సిబ్బందికి అన్యాయం జరగకుండా 2020 మార్చి లాక్డౌన్ నాటికి పనిచేస్తున్న వారందరినీ పరిగణనలోకి తీసుకొని నెలకు రూ.2000 నగదు, 25 కిలోల సన్నబియ్యం ఇవ్వనుంది.
విద్యాశాఖ వద్దనున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని దాదాపు 11వేల ప్రైవేటు పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 1.45 లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో బోధనేతర సిబ్బంది 27వేల మందిగా తేలింది. ఆర్థిక సహాయం పొందగోరే సిబ్బంది ఎంపికకు విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. ప్రైవేటు పాఠశాలల సిబ్బంది బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీకి ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్
నిజాయితికి నిలువెత్తు రూపం.. మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత