నవమాసాలు మోసి కనీ పెంచే తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదని అంటారు. మనుషులే కాదు పశు పక్ష్యాదుల్లో కూడా తల్లి మమకారాన్ని చూస్తూనే ఉంటాం. అలాంటింది ఈ మద్య కొంత మంది తల్లులు మూఢ నమ్మకాలతో కన్న పిల్లలనే చంపేస్తున్నారు. ఏపిలో మదనపల్లి ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మోతే మండలం మేకలపాడు తండాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాలతో అభం శుభం తెలియని ఆరునెలల పసిపాపను తల్లి హతమార్చింది. ఆమె మానసిక పరిస్థితి కొంతకాలంగా సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు.
మోతె మండలం మేకలపాటి తండాకి చెందిన బానోత్ భారతికి ఎనిమిదేళ్ల కిందట మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయినా కొద్దిరోజులకే విడిపోయారు. అనంతరం పుట్టింటికి వచ్చేసిన భారతి అదే తండాకు చెందిన కృష్ణను ప్రేమించింది. వీరి ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించలేదు.. ఆత్మహత్యాయత్నం చేయడంతో కూతురు పెళ్లి చేశారు. ఇటీవల భారతి రోజూ యూట్యూబ్లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ.. తనను తాను శివుడిగా భావిస్తూ వింతగా ప్రవర్తిస్తుండేది.
ఇటీవల గ్రామానికి వచ్చిన ఓ సాధువు ఆమెకు నాగదోషం ఉందని చెప్పినట్లు సమాచారం. నాగదోషం పోవాలంటే.. ఆరు నెలల బిడ్డను బలివ్వాలని నిశ్చయించుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో శివుడు బొమ్మను పక్కనపెట్టుకుని పాప గొంతు కోసం హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, భారతి బిఎస్సీ బిఈడి చదివిందని, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతుందని స్థానికులు తెలిపారు.
జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు.. పీలేరులో అరెస్ట్..
లోటస్పాండ్లో రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల..!