మందక్రిష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె నుంచి యాత్ర చేపట్టనున్నట్లు మందక్రిష్ణ మాదిగ ప్రకటించారు. అయితే ఈ యాత్రకు అనుమతి లేదంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి మంద క్రిష్ణను నల్లగొండ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు నుంచి వచ్చిన పోలీసులు తమ నాయకుడిని అదుపులోకి తీసుకున్నారంటూ.. ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా నేతలు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద కూడా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు వెంటనే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలంటూ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. వీరిని తెలుగుదేశం పార్టీ కార్యలయ రక్షణ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అక్కడి టీడీపీ ఫ్లెక్సీలను చించేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తమ నాయకుడి అరెస్టుకు నిరసనగా సెల్టవర్ ఎక్కారు. చంద్రబాబు తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళనలతో అట్టుడికించారు.