కోస్టల్ బ్యాంక్ ఛైర్మెన్, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయారం మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్ బయట పడింది. పోస్ట్ మార్టం నివేదకలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆ నివేదికను చూసి పోలీసులు అవాక్కయ్యారు. జయరామ్ పోస్ట్ మార్టం కంటే 24 గంటలు ముందే హత్యకు గురైనట్లు నివేదికలో రావడంతో పోలీసులు షాక్ తిన్నారు. నందిగామ వద్దే హత్య జరిగి ఉంటుందని భావించిన పోలీసులకు ఈ రిపోర్ట్ ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ చేసింది. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి పలు కీలక విషయాలు వెల్లడించారు.జయరామ్ పోస్టుమార్టంకి 24 గంటలకు ముందు హత్య చేయబడ్డారని పోస్ట్ మార్టం నివేదికలో వచ్చిందని తెలిపారు.
హత్య జనవరి 31 మధ్యాహ్నం జరిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోనే జయరామ్ ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హత్య అనంతరం విజయవాడ వరకు మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు రెండు కార్లు వినియోగించారని తెలిపారు.
ఈ కేసులో పోలీసులు పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా శిఖాచౌదరెని పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా పోలీసులు అదుపులో ఉన్న శిఖా చౌదరిని పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఆమె పేరిట ఆస్తులు బదలాయించిన జయరాం.. డాక్యుమెంట్లు మాత్రం తన దగ్గరే ఉంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. డాక్యుమెంట్ల కోసం స్నేహితులతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన రోజు జయరాం కారులో తెల్లచొక్కా వ్యక్తి, మహిళ ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆ యువతి శిఖాచౌదరా? వేరొకరా అనే కోణంలో విచారిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.