ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. విద్యా వ్యవస్థను మార్కెట్లో సరుకుగా సీఎం కేసీఆర్ చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును మంగళవారం (మార్చి 27) తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది.
మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు ప్రభుత్వం బిల్లు ఆమోదించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం (మార్చి 28)న విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్యూ, ఏఐడీఎస్ఓ, టీవీఎస్, ఎస్ఎఫ్ఐ, టీవీవీ, విజృంభణ, డీఎస్యూ తదితర సంఘాల నాయకులు ఆందోళన చేశారు. అయితే ఈ ర్యాలీ చేపట్టి అసెంబ్లీ ముట్టడికి పయనమయ్యారు.
బషీర్బాగ్ నుంచి అసెంబ్లీని ముట్టిడించేందుకు విద్యార్థులు, నాయకులు పరుగులు పెట్టారు. ఈ విషయం ఆలస్యంగా గమనించిన పోలీసులు ఎట్టకేలకు నాంపల్లిలో గన్పార్క్ వద్ద వీరిని అడ్డుకున్నారు. ఈ నాయకులను ఎక్కడికక్క అరెస్టులు చేశారు. అరెస్టులు చేసిన వారిని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఆర్ట్స్ కళాశాల ఎదుట రాస్తారోకో : విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్ను నిరసిస్తూ ఆర్ట్స్ కళాశాల వద్ద రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అరెస్టయిన వారిలో పీడీఎస్యూ OU అధ్యక్షుడు విష్ణు, టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోట శ్రీనివాస్, నిరుద్యోగ జెఏసీ ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ తదితరులు ఉన్నారు. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న ఓయూ ఈ ఆందోళనతో ఉద్రిక్తమైంది.