దేశంలో బడా పారీశ్రామిక వేత్తలు బ్యాంకులను మోసం చేస్తున్న సంఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. కనిష్క్ గోల్డ్ 14 ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన సంగతి తెలిసిందే. వివిధ బ్యాంకులకు రూ.9,000 కోట్లు పంగనామం పెట్టిన విజరు మాల్యా, పిఎన్బిని రూ.13వేల కోట్లకు మోసం చేసిన నీరవ్ మోడీ తరహాలోనే కనిష్క్కూడా బిచానా ఎత్తేసింది.
ఇప్పుడు తాజాగా చెన్నైలోని మరో జ్యూయలరీ సంస్థ నాదెళ్ల సంపత్ జ్యూయలరీ సంస్థ నకిలీ దస్తావేజులతో ఎస్బీఐకి కుచ్చుటోపి పెట్టారు. బ్యాంకునుండి రూ.250 కోట్ల రుణం తీసుకుని మోసం చేసింది. 2010 నుంచి జ్యూయలరీ సంస్థ రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది. గత సంవత్సరం నవంబర్ నుంచి దాదాపు 21వేల కన్నా ఎక్కువ మంది 75 కోట్ల రూపాయల వరకు బంగారం కొనుగోలు కోసం నెలవారి వాయిదాల రూపంలో ఆ సంస్థకు చెల్లిస్తున్నారు.
దాదాపు వేయి కన్నా ఎక్కువ మంది కస్టమర్ లు ఆ సంస్థపై ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు జ్యూయలరీ సంస్థ బోర్డు మెంబర్స్ ఎండీ. రంగనాథ గుప్తాపై అలాగే ఆయన కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో శాఖలున్న నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ 2017 అక్టోబరులోనే దివాలా తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు.