భారత్, ఇరాన్ ల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చబహర్ ఓడరేవుపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని కారణంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సంబంధం లేకుండా నేరుగా యూరప్ తో అనుసంధానం అయ్యే అవకాశాలు వస్తాయి.
ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా చబహర్ తో పాటు ఇరు దేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. భారతో లో ఇందన దిగుమతి, ఉగ్రవాదంపై సమష్టి పోరు వంటివి కీలకం. ఇక చబహర్ రేవు కోసం 500 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. 2001 సంవత్సరంలో వాజ్ పేయ్ ప్రధానిగా ఇరాన్ లో పర్యటించారు.
ఆ తర్వాత మళ్లీ నరేంద్రమోదీ మాత్రమే ఇరాన్ లో పర్యటించడం విశేషం. చబహర్ ఒప్పందంతో రెండు దేశాల గతి మారుతుందని, దీనికి మనమంతా సాక్షులుగా ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ, భారత ప్రధాని మోదీ ఇద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడడం మరో విశేషం. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల కారణంగా అక్కడా, ఇక్కడా శాంతి, సౌభ్రాత్రత్వం వెల్లివిరుస్తాయని వారిద్దరు అన్నారు. రెండు దేశాలు ఆర్ధికంగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఇలాంటి ఒప్పందాల కారణంగా యువతకు మంచి ఉపాది దొరుకుతుందని, దీంతో వారు ఉగ్రవాదం వైపు వెళ్లే అవకాశాలు ఉండవని వారిద్దరు అన్నారు.