ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై మరో సారి తన అక్కసును వెల్లగక్కారు. భారత్ తో అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. రెండు దేశాల మధ్య అణుయుద్ధం వస్తే అది అంత వరకే పరిమితం కాదని సరిహద్దులు దాటి విస్తరిస్తాయని ప్రపంచాన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడారు.జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. కశ్మీర్లో అమానవీయంగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారని, దానిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ నిందించేది తమనే అని ఇమ్రాన్ ఆరోపించారు. ఇన్నాళ్లు బంధించి ఇప్పుడు కర్ఫ్యూ ఎత్తేస్తే కశ్మీర్ యువత తుపాకీ చేతబట్టక ఇంకేం చేస్తుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.కర్ఫ్యూ తొలగించిన తరువాత ఏం జరుగుతుందో, భారత ప్రధాని మోదీ ఆలోచించారా? అక్కడ నెత్తుటేరులు పారకుండా ఉంటాయా? అంటూ హెచ్చరించారు. అహంకారం మోదీని గుడ్డివాడిని చేసిందని వ్యాఖ్యా నించారు.
యుద్ధం వస్తే నివారించడానికే ఐక్యరాజ్యసమితి ఉందని, ఇప్పుడా సంస్థ 120 కోట్ల మంది పక్షాన ఉంటుందా, న్యాయం వైపు ఉంటుందా? అంటూ పెద్దమనిషి తరహాలో ప్రశ్నించారు.కశ్మీర్లో నెలకొన్న అమాన వీయ పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం స్పందించాలన్నారు.