హైదరాబాద్: నోట్ల రద్దు ప్రకటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో
ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల రద్దు ప్రకటన తర్వాత గవర్నర్ నరసింహన్ను కలిసి రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి వివరించారు. ఇదే విషయంపై ప్రధాని మోదీని కూడా కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రానికి నష్టం తగ్గించేలా నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నించనున్నరని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత డీకె అరుణ కేసీఆర్పై విమర్శలు చేశారు.
ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆమె ఆరోపించారు. నోట్ల రద్దు సాకుతో అన్ని సంక్షేమ పథకాలకు మంగళం పాడేందుకు కేసీఆర్ చూస్తున్నారని అన్నారామె. డబల్ బెడ్రూం ఇళ్ల హామీ రెండున్నర్ర ఏళ్ల క్రితం ఇచ్చారని, కానీ ఇప్పటివరకూ ఎక్కడెక్కడ కట్టారో చెప్పాలని అన్నారు. ఈ సమయంలో ఈ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏంటో కీసీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు డీకె అరుణ.