వైవీ సుబ్బారెడ్డి.. జగన్ కు బాబాయ్ వరుస అవుతాడు.. సొంత కుటుంబ సభ్యుడు అన్నట్టే.. పైగా 2014లో ఒంగోలులో గెలిచి ఎంపీగా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తికి 2019 ఎన్నికల్లో జగన్ ఎంపీ టికెట్ ఇవ్వలేదు.. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీకి టికెట్ నిరాకరించారు. అప్పట్లో కాస్త నిరాశ చెందిన వైవీ.. ఇప్పుడు జగన్ గెలుపుతో త్యాగానికి ఫలితం కనిపించింది. జగన్ ను వేయినోళ్ల పొగిడారు.
అయితే పార్టీ గెలుపు కోసం ఏకంగా ఎంపీ సీటును త్యాగం చేసిన బాబాయ్ వైవీకి జగన్ ఏం పదవి ఇస్తాడనే చర్చ పార్టీలో విస్తృతంగా సాగింది. మొన్నటి వరకు ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వైవీకి అంతకంటే పెద్ద పదవిని ఇచ్చేందుకు జగన్ రెడీ అయినట్లు సమాచారం.
తాజాగా జగన్ తన బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటును ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సొంత బాబాయ్ కావడం.. పైగా పార్టీ కోసం సిట్టింగ్ ఎంపీ పదవిని త్యాగం చేయడంతో సముచిత స్థానం కల్పించేందుకు రాజ్యసభకు పంపిస్తున్నట్టు జగన్ అన్నట్టు సమాచారం.
కాగా టీటీడీ చైర్మన్ పదవికి వైవీ వైదొలగడంతో ఇప్పుడు రేసులో మోహన్ బాబు, పలువురు రాయలసీమ నేతలు పోటీపడుతున్నారు. వీరిలో జగన్ ఎవరికి ఆ అత్యున్నత పదవిని ఇస్తారని ఆసక్తిగా మారింది.