ఏపీకీ ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ, చంద్రబాబు మోసం చేశారని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేపట్టిన శాంతియుత బంద్లో విషాదం చోటు చేసకుంది. రాష్ట్రానికి హోదా కావాలని నిరసిస్తూ బంద్లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందారు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి బుట్టాయగూడెంలో పార్టీ కార్యకర్త దుర్గారావు ఏపీ బంద్లో పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నపార్టీ కార్యకర్తలు, నాయకులను ఎక్కడి క్కడ అరెస్ట్చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
తెల్లం బాలరాజుతో పాటు దుర్గారావు, మరికొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా బుట్టాయిగూడెం పోలీస్స్టేషన్కు తరలించే యత్నం చేయగా తోపులాట జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో దుర్గారవు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొంత సమయానికే దుర్గారావు చనిపోయారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం శాంతియుతంగా నిర్వహిస్తోన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల బలవంతపు అరెస్ట్లు, గృహ నిర్బంధాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. హోదా పోరాటానికి మద్దతు తెలపాల్సిన చంద్రబాబు నాయుడు ఏపీ బంద్ను అడ్డుకోవాలని పోలీసులు, ఉన్నతాధికారులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.