అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిస్కరించిన సంగతి తెలిసిందె. అయితె ఇప్పుడు తాజాగా ఎందుకు బహిస్కరించాల్సి వచ్చిందో రాష్ట్రపతికి జగన్ లేఖ రాశారు. తన లేఖలో ప్రధానంగా ఫిరాయింపు రాజకీయాలనే ప్రస్తావించారు.
చంద్రబాబునాయుడు, అభివృద్ధి, పరిపాలనను పక్కనబెట్టి, ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహించడమే పనిగా పెట్టుకున్నారని లేఖలో జగన్ ఆరోపించారు. అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ వైసీపీ తరపున గెలిచిన 21 మంది ఎంఎల్ఏలతో పాటు ఎంఎల్సీని ప్రలోభాలకు గురిచేసి అనైతికంగా టిడిపిలో చేర్చుకున్నట్లు ఆరోపించారు. ప్రలోభాల్లో భాగంగా పలువురికి భారీ ఎత్తున డబ్బు కూడా ఇచ్చినట్లు తెలిపారు.
ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన కూడా లేదన్నారు. తమ పార్టీ నుండి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పనలను వైసీపీ శాసనసభా పక్ష ఉపనేతలుగా పేర్కొంటూ అసెంబ్లీ బులెటిన్ కూడా విడుదలవ్వటం విచిత్రంగా ఉందన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా వైకాపా తరఫున ఎంపికైన ఎమ్మెల్యేలను తన పక్కన చేర్చుకుని, వారిలో కొందరికి మంత్రి పదవులిచ్చారని గుర్తు చేసిన జగన్, చంద్రబాబు వైఖరికి నిరసనగా త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని కోవింద్ కు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పడం లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేలా కలుగజేసుకోవాలని ఈ లేఖలో కోవింద్ ను జగన్ కోరారు.