ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ మళ్లీ గళమెత్తింది. ఢిల్లీ గల్లీల్లో మళ్లీ పోరాటం మొదలుపెట్టింది. ఏపీ విభజన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో జంతర్మంతర్లో దీక్ష చేపట్టింది. వంచనపై గర్జన దీక్షలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, సినీ నటుడు పృథ్వీ , పార్టీ నాయకులు, కార్తలు పాల్గొన్నారు.
వంచనపై గర్జన సభలో పృథ్వీ బాబు, పవన్లపై నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ మొదటినుంచి పోరాటం చేస్తుంటే…బాబు కుప్పిగంతులు వేస్తున్నారని మండిపడ్డారు. మొదట ప్యాకేజీకీ ఒప్పుకొని ఇప్పుడు ప్రత్యేకహోదా అంటూ డ్రామాలాడుతున్నారని ఎద్దేవ చేశారు.
పార్టీ సిద్దాంతాలకు తిలోదకాలిచ్చి బద్ధ శతృవు అయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణా ప్రజలు ఎన్నికల్లో కూటమిని చిత్తుగా ఓడించారని…రేపు ఏపీలో కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నుంచి మెుదలు పెట్టి కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వరకు ఎంత ప్రచారం చేసినా ఏం జరిగిందో ప్రజలు చూశారంటూ విమర్శించారు.
తెలంగాణాలో పార్టీ మారిన నేతలను చిత్తుగా ఓడించండి అని చెప్పిన బాబు మరి ఏపీలో కూడా అదే విధంగా చెప్తారాని ప్రశ్నించారు. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి, మాటపై నిలకడలేని వ్యక్తి, అనైతిక పొత్తులకు ఆద్యుడు చంద్రబాబు నాయుడేనంటూ దుమ్మెత్తిపోశారు.
మరో వైపు పవన్ను కూడా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. సంక్రాంతి పండుగకు హరిదాసుల్లా వచ్చిన వ్యక్తులు తమను ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. రాబోయేది రాజన్న రాజ్యం అని జోష్యం చెప్పారు.