ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ను లాంఛనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు కొన్ని కీలక సూచలను చేశారు.
ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీకి ఓట్లు వేశారని… ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరిపాలన కొనసాగేలా నేతలందరూ సహకరించాలని కోరారు. వైసీపీ సాధించిన భారీ మెజార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని, ఇది తన ఒక్కడి విజయం కాదని, పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు కలిసి సాధించిన గెలుపు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
ప్రతి గ్రామంలోని కార్యకర్త తనకు తోడుగా ఉండటంతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. ప్రజలకు ఏరకమైన కష్టాలు వచ్చినా అండగా నిలిచిందని వైసీపీయేనని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో గెలవడమే టార్గెట్గా నాయకులందరూ పెట్టుకోవాలని సూచించారు.రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన చేస్తానని… ఇందుకు అందరి సహకారం ఉండాలని జగన్ అన్నారు.
కేవలం ఒక్కశాతం ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమయ్యామన్న జగన్… ఈ సారి టీడీపీతో పోల్చితే పదిశాతం అత్యధికంగా ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చామని అన్నారు. టీ ఇదే సందర్భంలో టీడీపీ, చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను చంద్రబాబు డబ్బు ఆశ చూపించి కొన్నారని … ఇప్పుడు టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మిగిలారని ఎద్దేవ చేశారు.