వైఎస్ జగన్ పాదయాత్ర తిరిగి ప్రారంభ మయ్యింది. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్పై కత్తి దాడి ఘటన తర్వాత చికిత్స అనంతరం డాక్టర్ల సూచలన మేరకు విశ్రాంతి తీసుకున్న జగన్ ప్రజల ముందుకు కొచ్చారు.ఈ ఘటనతో 17 రోజుల పాటు పాదయాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే.
నేడు తన ప్రజాసంకల్ప యాత్రను విజయనగరం జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పాపయ్యవలసలో తిరిగి ప్రారంభించారు. నిన్న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్కు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
దాడి ఘటన తర్వాత జగన్కు ప్రభుత్వం మూడంచెల అసాధారన భద్రతను కల్పించింది. ఇప్పటికే జగన్కు పాదయాత్రలో సరైన భద్రత కల్పించడంలేదని అన్ని వర్గాలనుంచి విమర్శలు రావడంతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులో ఏర్పాటు చేసిన రోప్ పార్టీ మధ్య ఆయన యాత్ర సాగుతుంది. అలాగే 50 మంది సిబ్బంది బాడీ కెమెరాలతో రక్షణగా ఉంటారు.
కంట్రోల్ రూమ్ నుంచి డ్రోన్ల సాయంతో పాదయాత్ర రూట్ను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. అలాగే జగన్ బస చేసే క్యాంపు చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో మాదిరి అభిమానులు సెల్ఫీలు తీసుకోవడానికి వీలుండదు.
జగన్ను కలిసే వారికి గుర్తింపు జారీ చేస్తున్నారు.. వీఐపీలకు ఎరుపు రంగు కార్తులు, జగన్ను అనుసరిస్తున్న వారికి నీలం రంగు కార్డులు, పాదయాత్రలో రక్షణగా ఉన్న వారికి ఆకుపచ్చ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అలాగే పాదయాత్ర మార్గంలో సీఆర్పీఎఫ్ పోలీసులు ముందుగానే తనిఖీలు చేస్తారు. జగన్ పాదయాత్ర చేసే రూట్లలో రోడ్ క్లియరన్స్ చేయడానికి ప్రత్యేకంగా గ్రూపును ఏర్పాటు చేశారు.