తమిళనాడు దివంగత మాజీ ముఖ్య మంత్రి జయలలిత మరణం తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఆన్నాడిఎంకె పార్టీ గుర్తుకోసం రసవత్తర పోరు జరగుతోంది. అప్పటి నుంచి పార్టీ గుర్తు కోసం అటు పన్నీర్ సెల్వం, ఇటు శశికళ వర్గాల మధ్య పోరు సాగుతోంది. రెండాకుల పార్టీ గుర్తు ఎవరిదనె కథ క్టైమాక్స్ చేరింది. పార్టీ గుర్తుకోసం ఆధిపత్యపోరు ఎన్నికల కమీషన్కు చేరింది.
అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండాకులు’ ఎవరికి చెందుతుందో సోమవారం తేలనుంది. దీనిపై విచారణను ఎన్నికల సంఘం అక్టోబర్ 16కు వాయిదా వేసింది. అయితే ఇటవల పళని, పన్నీర్ సెల్వం ఒక్కటవడంతో తాజాగా పళనిస్వామి, శశికళ, జయలలిత మేనకోడలు దీప వర్గాల మధ్య రెండాకుల గుర్తు కోసం పోటీ నెలకొంది. ఇప్పటికే ఈ మూడు వర్గాలు విడివిడిగా ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు దాఖలు చేశాయి. దీంతో ఈ అంశంపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టనుంది. సోమవారం నాడు దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లోనూ ఈ రెండాకుల సమస్య తలెత్తింది. దీంతో ఆ గుర్తును ఎవరికీ ఇవ్వకుండా తాత్కాలికంగా స్తంభింపజేసింది ఎన్నికల సంఘం. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అమ్మ వర్గానికి టోపీ, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గానికి జంట విద్యుద్దీపాల స్తంభాన్ని గుర్తులుగా కేటాయించింది. అప్పటి నుంచి ఆ గుర్తును పొందేందుకు అన్నాడీఎంకే వర్గాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రెండాకులు ఎవరికొస్తుందోనని తమిళనాట ఉత్కంఠ నెలకొంది.