గతంలో టీపీసీసీ చీఫ్గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య.. ఇప్పుడు తన టికెట్ కోసం ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి రావడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో అభ్యర్తులకు బీ ఫారాలు ఇచ్చిన పొన్నాలకు ఆ బీ ఫారమే అందట్లేదు.
మొదటి జాబితాలో తన పేరు లేకపోవడాన్ని అవమానంగా భావించిన పొన్నాల.. రెండో జాబితాలోనూ తనను పక్కనపెట్టడంపై తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వచ్చే జాబితాలోనైనా పొన్నాల పేరు లేకపోతే.. ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కార్యకర్తలు ఉత్తమ్ను హెచ్చరించారు. జనగామ కాంగ్రెస్లో పెద్ద దిక్కుగా ఉన్న పొన్నాలను పక్కనపెట్టడం వెనుక పెద్ద కుట్రనే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
టికెట్ దక్కకపోవడంతో పార్టీ తీరుకు నిరసనగా 13 మంది కౌన్సిలర్లు, ఏడు మండలాల పరిధిలోని 28 వేల మంది కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ లేఖలను టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు.
జనగామ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెంచారపు శ్రీనివాస్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవలు చేసిన పొన్నాలకు సీటు కేటాయించకుండా.. కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించిందన్నారు.
పొన్నాలను కాదని జనగామలో కాంగ్రెస్ ఎవరిని పోటీకి దింపినా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. పొన్నాలకు టికెట్ రాలేదని మనస్తాపం చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఆత్మాహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.జనగామ అసెంబ్లీ టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని స్థానిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.